Telugu Gateway
Telugugateway Exclusives

కాళేశ్వరం... బిఆర్ఎస్ సేమ్ టు సేమ్!

కాళేశ్వరం... బిఆర్ఎస్ సేమ్ టు సేమ్!
X

బట్టలకు అంటిన మురికి పోవాలంటే షాప్ కు వెళ్లి ఒక నిర్మా ప్యాకెట్ కొనుక్కొని ఆ మురికి వదిలించుకోవచ్చు. కానీ వేల కోట్ల రూపాయల అవినీతి మురికి పోవాలంటే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర ఉన్న నిర్మా పాకెట్స్ మాత్రమే కావాలి అంటూ సీఎం గా ఉన్న రోజుల్లో కెసిఆర్ మీడియా సమావేశాల్లో వీడియోలు ప్రదర్శించి మరీ చూపిన విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటి అంటే ఇప్పుడు అదే బీజేపీ దగ్గర ఉన్న ప్రత్యేక నిర్మా పాకెట్స్ కోసం బిఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ కు ఈ ప్యాకెట్ ఇప్పించేందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలో దిగారని...కొద్ది రోజుల క్రితం ఆయన తన ఢిల్లీ పర్యటన ప్రధాన అజెండాలో ఇది కూడా ఒకటి అని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పెద్దలకు తన సొంత సమస్యలు విన్నవించుకోవటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు కోవటం వల్ల కాంగ్రెస్ ను దెబ్బతీయవచ్చు అని...ఇద్దరూ కలిస్తే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. అయితే దీనికి అవతలి నుంచి వచ్చిన స్పందన మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికే బిఆర్ఎస్ కాళేశ్వరం స్కాం తో పాటు గొర్రెల స్కాం, హెచ్ఎండిఏ లో వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు అన్నిటి నుంచి సేఫ్ గా బయటపడాలంటే నిర్మా ప్యాకెట్ తప్ప మరో మార్గం లేదు అనే భావంలో బిఆర్ఎస్ కీలక నేతలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది. ఇంకా రాబోయో రోజుల్లో వెలుగులోకి వచ్చే ధరణి తో పాటు ఐటి, పరిశ్రమల శాఖలోని స్కాం లు అన్ని వెలికి తీయాలంటే రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ ఐదేళ్ల సమయం కూడా చాలదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత జిల్లాల దగ్గర నుంచి మొదలు పెడితే కీలక నాయకులు అందరూ అధికార పార్టీ వైపు చూస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒకటి, రెండు సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోవటం కష్టం అని...ఈ ఎన్నికలు కూడా అయిపోతే ఇక బిఆర్ఎస్ లో ఎవరో కొంత మంది తప్ప ముఖ్య నేతలు పక్కచూపులు చూడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత బిఆర్ఎస్ పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగే ఉంది అని...కాళేశ్వరం పునాదులు ఎలా కదిలిపోయాయో...ఇప్పుడు బిఆర్ఎస్ పునాదుల పరిస్థితి కూడా అలాగే ఉంది అని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి అటు కెసిఆర్..ఇటు కేటీఆర్ లు పార్టీ నిర్మాణంపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా వ్యవహరించారు అని..రాబోయే రోజులు దీని ఫలితాలు చూస్తారు అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. ఈ భయంతోనే బిఆర్ఎస్ కీలక నేతలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా పొత్తు కోసం రాయబారం పంపారు అని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుత వాతావరణం...బీజేపీ నేతల ఎటాక్ చూస్తుంటే ఇది వర్క్ అవుట్ అయ్యేలా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ స్కాంల గండం నుంచి గట్టెక్కేందుకు ఏ అవకాశాన్ని కూడా వదలకుండా తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నారు బిఆర్ఎస్ అగ్రనేతలు. మరి ఇవి ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Next Story
Share it